అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విమర్శలు గుప్పించారు. శనివారం వరుస ట్వీట్లతో విమర్శలు సంధించారు.
మాజీ మంత్రులు కొందరు బాబు అక్రమ కొంపకు వాచ్మెన్ల మాదిరిగా కాపలా కాయడం ఏమిటి ? కర్మ కాకపోతే అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ముంపు ప్రాంతాలను డ్రోన్లతో ఎలా చిత్రీకరిస్తారని మీడియా ముందు వారు దబాయిస్తున్నారనీ, లింగమనేని ఇంటి గురించి ఆందోళన మానేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయపడాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు.
లోకేశ్ పెద్ద మనిషి అయ్యాక ఇంత పెద్ద వరదను చూసి ఉండరని విజయసాయిరెడ్డి అన్నారు. వానలు లేకున్నా ఏడు లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో లోకేశ్కు అంతుబట్టడం లేదనీ, వరదలో కొట్టుకువచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహపడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయనకు బేసిక్ నాలెడ్జ్ పెరగడం కోసం ఇరిగేషన్ శాఖ వారితో కౌన్సిలింగ్ ఇప్పించాలని విజయసాయిరెడ్డి సూచించారు.
అన్న క్యాంటిన్ల కోసం కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తే ప్రయోజనం ఏమీ ఉండదనీ, అన్న క్యాంటిన్ బకాయిలు వంద కోట్ల రూపాయలు వారు దోచుకున్న సొమ్ము నుండి చెల్లిస్తే వెంటనే తెరుచుకుంటాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే షెడ్డుకు 30నుండి 40లక్షల రూపాయలు దండుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ డబ్బును తిరిగిచ్చినా ఐదేళ్ల పాటు నడుస్తాయని విజయసాయిరెడ్డి అన్నారు.
భ్రమరావతి అనే ప్రపంచ నంబర్ వన్ రాజధానిలో ఉన్న నాలుగు భవనాలకు స్వాతంత్ర్య దినోత్సవం రోజు లైటింగ్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఇంతగా మురిసిపోవడం ఏమిటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, ఆయన హైదరాబాద్ పలాయనం చిత్తగించడం దేవుడు రాసిన అసలు స్ర్కిప్ట్గా విజయసాయిరెడ్డి అభివర్ణించారు.