Omicron: తీవ్ర కలకలాన్ని రేపుతున్న ఒమైక్రాన్ (కోవిడ్ 19 వైరస్ కొత్త వేరియంట్) భారత్లోకి వచ్చేసింది. కర్ణాటక లో ఇద్దరికి ఇది సోకింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృవీకరించింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కేసులు భారత్ లో వెలుగు చూడటం ఇదే తొలి సారి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఒమైక్రాన్ వేరియంట్ కేసులు మన దేశంలో రెండు నమోదు అయ్యాయని చెప్పారు. ఈ రెండు కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు తెలిపారు.
Omicron: దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఇద్దరికి..
46 సంవత్సరాలు, 66 సంవత్సరాలు వయసు గల ఇద్దరు పురషులకు ఈ వేరియంట్ సోకినట్లు తెలిపారు. వీరిలో ఒకరు గత నెల 11న, మరొకరు గత నెల 20వ తేదీన దక్షిణాఫ్రికా నుండి వచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వెల్లడైన ఈ కేసుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలపై అధ్యయనం జరుగుతోందని డబ్ల్యుహెచ్ఒ తెలిపిందన్నారు. అయితే ఒమైక్రాన్ లక్షణాలు మన దేశంల ఇప్పటి వరకు మరీ అంత తీవ్రంగా లేవని అన్నారు. ఈ వైరస్ సంబంధించిన కేసులన్నింటిలోనూ చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని లవ్ అగర్వాల్ తెలిపారు.
Omicron: తెలంగాణలోనూ ఒమైక్రాన్ టెన్షన్..
తెలంగాణలోనూ ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. ఈ ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సీజన్ ను తేలికగా తీసుకోవద్దని ఆయన అన్నారు. బ్రిటన్ నుండి వచ్చిన ఓ ప్రయాణీకురాలికి ఒమైక్రాన్ సోకినట్లు అనుమానంగా ఉందనీ, జీనోమ్ సీక్వెన్సింగ్ కు శాంపిల్స్ పంపామని వైద్యులు తెలిపారు. సదరు బ్రిటన్ మహిళను టిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. వచ్చే రెండు మూడు నెలలు అత్యంత కీలకమని ఆయన అన్నారు.