జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసిపి అధినేత జగన్ పై ఎత్తు వేస్తున్నారు. అక్కడ అభ్యర్థిని మళ్లీ మూడోసారి మార్చేందుకు జగన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పిఠాపురంలో జనసేన – టీడీపీ పొత్తు ప్రభావం గట్టిగా ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు టికెట్ నిరాకరించారు. ఆ స్థానంలో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురానికి జగన్ బదిలీ చేశారు. ఆమె గతంలో అక్కడ 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు. గత రెండు సంవత్సరాలుగా పిఠాపురం నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేసే క్రమంలో వంగా గీత అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు.
అందుకు అనుగుణంగానే జగన్ నెల రోజుల క్రిందటే తొలి జాబితాలో వంగా గీతను పిఠాపురం ఇన్చార్జిగా నియమించారు. ఆమె అక్కడ వర్క్ కూడా మెదలు పెట్టేశారు. అయితే ఇప్పుడు ఏకంగా అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో జగన్ తన గేమ్ మార్చేశారు. వంగా గీతం పిఠాపురం నుంచి తప్పించి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మరో అసెంబ్లీ స్థానానికి బదిలీ చేస్తారని తెలుస్తోంది. పెద్దాపురం లేదా ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలలో ఎక్కడో ఒకచోట నుంచి వంగా గీతను బరిలోకి దింపుతారని తెలుస్తోంది.
ఇక పిఠాపురంలో పవన్ పై ముద్రగడ ఫ్యామిలీని నిలబెట్టేందుకు జగన్ రహస్య సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముద్రగడను వైసీపీలో చేర్చుకుని ఆయనను పవనపై పోటీ చేయించాలా లేదా ముద్రగడ్డ కుమారుడికి పిఠాపురం సీటు ఇవ్వాలా అన్న చర్చలు అయితే వైసిపి – ముద్రగడ కుటుంబాల మధ్య జరుగుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తీరు నచ్చక ఇటీవల ఆ పార్టీకి ముద్రగడ దూరంగా ఉంటున్నారు. తాజాగా టిడిపితో పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ముద్రగడ లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు జగన్ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికలలో ముద్రగడ ఫ్యామిలీ ఓడిపోతే తర్వాత ఎమ్మెల్సీ లేదా మరో కీలకపదవి కట్టబెట్టేలా హామీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ముద్రగడ ఫ్యామిలీ వైసిపి కండువా కప్పుకుని పిఠాపురంలో పవన్పై పోటీ చేస్తుందా లేదా అన్నది చూడాలి.