ఏపీలో సాధారణ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే జంపింగ్ జపాంగ్లు బాగా ఊపు అందుకున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనలోకి పలువురు కీలక నేతలు జంప్ చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక స్థానిక సంస్థలకు చెందిన పలువురు వైసిపి ప్రజాప్రతినిధులు తెలుగుదేశం లేదా జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసిపికి పెద్ద షాక్ లు తప్పేలా లేవు.
నగరానికి చెందిన పలువురు వైసిపి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. ఏలూరు కార్పొరేషన్ కు చెందిన 12, 30 డివిజన్లో కార్పొరేటర్లు కర్రీ శ్రీనివాస్ – పప్పు ఉమామహేశ్వరరావుతో పాటు మాజీ కార్పొరేటర్లు కౌలూరి చంద్రశేఖర్ – మాగంటి హేమ సుందర్ – పిలగల ప్రకాష్ వైసీపీకి రాజీనామా చేసి గురువారం తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీలో గత కొన్నిళ్ళుగా ఉంటున్న అక్కడ కనీస గౌరవం లేదని పార్టీలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్టు వారు తెలిపారు.
త్వరలోనే ఏరూరు నగర కార్పొరేషన్కు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూడా టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏలూరు నగరానికి చెందిన మరో కీలక వైసిపి దంపతులు కూడా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం అవుతుంది. నిన్న మొన్నటిదాకా ఏలూరు నియోజకవర్గ వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉన్నాం ఎమ్మార్డీ బలరాం ఆయన సతీమణి ఈడా మాజీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి తమ అనుచరులతో సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేదా యువనేత లోకేష్ సమక్షంలో పార్టీలో చేరాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
తాము పార్టీ మారుతున్న విషయాన్ని బలరాం సైతం మీడియాకు లిక్ చేశారు. ఇక మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏలూరు నగర మున్సిపల్ చైర్పర్సన్ గా విజయం సాధించారు. తెలుగుదేశంలో వీరికి అప్పట్లో మంచి ప్రాధాన్యత ఉండేది. అనంతరం ప్రజారాజ్యంలోకి వెళ్లి అటు నుంచి వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు కొంత కాలం పాటు మధ్య ఉన్న ఈశ్వరి ఏలూరు నగర వైసిపి కన్వీనర్ గా కూడా పనిచేశారు. జగన్ వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు అనూహ్యంగా వీరిని తప్పించి మాజీ మంత్రి ఆళ్ల నానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
అప్పటినుంచి వైసీపీలో వీరికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఈడా చైర్మన్ పదవి ఇచ్చిన ఆ పదవి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే నానితో తీవ్రమైన విభేదాలు కూడా ఏర్పడ్డాయి. వైసీపీలో సరైన గౌరవం లేకపోవడంతో తిరిగి తమ పాత గూటికి చేరేందుకు ఈశ్వరి బలరాం దంపతులు రెడీ అవుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు టిడిపి నుంచి పలువురు కీలక నేతలు టిడిపిలో చేరుతుండడంతో ఏలూరు టిడిపిలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇక్కడ నుంచి టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే బడేటి చంటి సోదరుడు బడేటి రాధాకృష్ణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలి జాబితాలోనే చంద్రబాబు ఆయన పేరు ప్రకటించారు.