జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తెలుగు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలలో తెలంగాణ బిజెపి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పోటీ నుండి తప్పుకోవడం తో సొంత క్యాడర్ నుండే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టడంతో.. అసలు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.
ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పవన్ సమావేశం అయిన తరువాత జనసేన బీజేపీ కలిసి నడిచే విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే టాక్ వస్తోంది. పవన్ డిల్లీ పర్యటన తో రెండు పార్టీ నేతలలో కూడా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఇటీవల ఏపీ పర్యటనలో అమరావతి రైతులతో పవన్ సమావేశమైన సమయంలో.. రాజధాని రైతులకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది.
దీంతో పవన్ ఢిల్లీ పర్యటన అమరావతి రైతుల లో కూడా కొత్త ఆశలు రేపుతున్నాయి. మరోపక్క తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా జనసేన పోటీకి దిగకుండా బిజెపి పార్టీకి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో గ్రేటర్ ఎన్నికలలో కాషాయం పార్టీ తరఫున ప్రచారానికి కూడా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్.. ఢిల్లీ పర్యటన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.