జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్తూరు పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమయ్యారు. తిరుపతిలో జరిగిన ఈ సమావేశానికి భారీగా జనసేన క్యాడర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎప్పుడూ కూడా చిరంజీవి ప్రస్తావన రాజకీయాల్లో పెద్దగా తీసుకురానీ పవన్ తాజాగా తీసుకొచ్చారు.
అడపాదడపా మాత్రమే ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడే పవన్ తిరుపతి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పవన్ మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే ఏపీ రాజకీయ ముఖచిత్రం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటే సీఎం కుర్చీలో కూర్చునేవారని పేర్కొన్నారు.
అధికారం అనేది మనకు బాధ్యత అలంకారం కాదు. అజమాయిషీ చేయడానికి అధికారం అని ఇప్పుడు పాలకులు అనుకుంటున్నారు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసమో ఇసుక అమ్ముకోవడానికో, మద్యం అమ్ముకోవడానికో నేను సీఎం అవ్వాలని అనుకోవడం లేదని పవన్ తెలిపారు. ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటు పెద్ద ఇబ్బందు కలిగించదని తెలిపారు. వైసీపీ ని గెలిపించిన రైతులను అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడం దారుణమని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీలపై ఎస్సీలతోనే కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ అతి తక్కువ టైమ్ లోనే నిలబడగలిగిన సత్తా జనసేన పార్టీ నిరూపించిందని పవన్ తెలిపారు. తిరుపతిలో జరిగిన ఈ సభలో భారీగా జనసేన క్యాడర్ పాల్గొనడం జరిగింది.