హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో ఈ బెయిల్ మంజూరైంది. ఏబీసీఎల్ ఖాతాల నుంచి రవిప్రకాశ్ అక్రమంగా 18 కోట్లు డ్రా చేశారనే అభియోగంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. కొన్ని రోజులు చంచల్ గూడా జైల్లో ఉన్న రవిప్రకాశ్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల పూచికత్తు సమర్పించాలని, హైదరాబాదు వదిలి వెళ్లకూడదని ఆదేశించింది.
ఇదిఇలా ఉంటే.. రవిప్రకాశ్పై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ ఐడి క్రియేట్ చేసినట్టు రవిప్రకాశ్పై అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ యాక్ట్ కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీవీ9 ఛానెల్ లో పలు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏబీసీఎల్ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా 18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 18 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన రవిప్రకాశ్పైకు ఇటీవలే న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.