అమరావతి, ఏప్రిల్ 12: ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ ఆఫీసర్లు (పిఒలు), అసిస్టెంట్ పోలింగ్ అధికారుల (ఎపిఒలు)కు ఇవిఎంల నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన కల్పించకపోవడం, ముందుగా తనిఖీలు నిర్వహించకపోవడం తదితర కారణాల వల్ల అటు పోలింగ్ సిబ్బంది, ఇటు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 479 పోలింగ్ బూత్లలో రాత్రి పది గంటల తరువాత కూడా పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 4583 చోట్ల ఇవిఎంలు మోరాయించాయి. 618 కేంద్రాల్లో రెండు గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. పెద్ద ఎత్తున ఇవిఎంలు మోరాయించినా రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాత్రం 318 ఇవిఎంలు మాత్రమే పని చేయడం లేదని చెప్పారు. ఆలస్యంగా ప్రారంభమయిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడం గానీ సమయం పెంచడం గానీ చేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినా వారు స్పందించలేదు. ఆరు గంటలలోపు క్యూలైన్లో ఉన్న అందరికీ రాత్రి ఏ సమయం అయినా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని సిఇఒ ద్వివేది ప్రకటించారు. మునుపెన్నడూ లేని విధంగా అర్థరాత్రి దాటిన తరువాత కూడా పోలింగ్ కొనసాగించారు.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గుడ్డిగూడెం, విశాఖపట్నం 227 పోలింగ్ బూత్, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి క్రీస్టియన్పేట, విజయనగరం జిల్లా సాలూరు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లా కనిగిరి,శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, విజయవాడ తూర్పు తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అర్థరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది.
బ్యాలెట్ ఉపయోగించ రోజుల్లో కూడా ఇంత సుదీర్ఘంగా పోలింగ్ జరిగిన దాఖలాలు లేవని ఓటర్లు చెబుతున్నారు.
256 కేంద్రాల్లో రాత్రి 10గంటల వరకూ, 139 కేంద్రాల్లో 10.30గంటల వరకూ, 70 కేంద్రాల్లో 11గంటల వరకూ, 14 కేంద్రాల్లో రాత్రి 12.30గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు.
సాయంత్రం ఆరు గంటల వరకూ 71.43 శాతం వరకు పోలింగ్ నమోదు కాగా మెత్తం ఇవిఎంలలో పోలింగ్ పూర్తి అయిన తరువాత 76.69 శాతం నమోదు అయ్యింది.