తాను తీసిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి చిత్రం తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. ఆ తరువాత తెలుగు వెండితెర అగ్ర హీరోల అందరితో సినిమాలు తీసి అగ్ర దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు పూరీ జగన్నాథ్. కేవలం దర్శకుడిగానే కాకుండా.. పూరీ టాకీస్ బ్యానర్ స్థాపించి పలు సినిమాలు తీసి నిర్మాతగానూ మారారు పూరీ జగన్నాథ్.
అయితే, ఆయన ఇటీవల పలు అంశాలను గురించి ప్రస్తావిస్తూ.. దానిపై ఆయన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పూరీ మ్యుజింగ్స్ పేరుతో వస్తున్న ఆ విడియోలలో ఇప్పటికే ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. తాజాగా “బ్రిటీష్” వారి గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ వారు ఈ ప్రపంచనికి ఎన్నో విషయాలను నేర్పించారని చెప్పారు.
బ్రిటీష్ వారు అంటే మనకు పడదు… కానీ ఆ విషయాన్ని పక్కనపెట్టి చూద్దాం.. అంటూ.. నేడు బ్రిటీషర్ల జనాభా 6.5 కోట్లు ఉన్నప్పటికీ.. 16 వ శతాబ్దంలో కేవలం 50 లక్షలు కూడా ఉండదనీ, ఇందులో నావికులు, సైనికులు మొత్తం కలిపి 50 వేల కంటే తక్కువగానే ఉన్నప్పటికీ.. పరిమాణంలో 13 రేట్లు పెద్దదైన మన దేశాన్ని వాళ్ళు ఆక్రమించారని అన్నారు. యావత్ ప్రపంచాన్నీ పాలించిన బ్రిటీషర్లు సూర్యుడు అస్తమించని తమ సామ్రాజ్యాన్ని సృష్టించారని పేర్కొన్నారు.
మరీ ముఖ్యంగా యావత్ ప్రపంచానికి బ్రిటీషర్లు చాలా విషయాలు నేర్పించారని తెలిపారు. వారు ఆక్రమించిన దేశాలన్నింటినీ తమ దేశాలుగా భావిస్తూ.. అభివృద్ధి చేయడంతో పాటు అందరినీ భాషా పరంగా కలుపుతున్న ఇంగ్లీష్ ను నేర్పించారని వెల్లడించారు. అలాగే, ప్రపంచంలోని జనాభా అందరికీ ప్యాంట్లు, షెర్టులు వేయడం నేర్పించారని అన్నారు. ప్రత్యేకంగా బ్రిటీష్ వారు ప్రపంచానికి అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్పించారని అన్నారు. ఇప్పటికీ వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయని పేర్కొన్నారు పూరీ జగన్నాథ్.