YS Sunitha: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వివేకా హత్య కేసు దర్యాప్తు మందకొడిగా సాగుతోందని, నిందితులను జగన్మోహనరెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు దోషులను శిక్షించాలని అయిదేళ్లుగా తాను పోరాటం చేస్తున్నానన్నారు. తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజు కు ధన్యవాదాలు తెలిపారు.
ట్రయల్ జరిగితే వివేకా హంతకులకు శిక్ష పడుతుందని, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు. ఇంత కాలం అవుతున్నా సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని కోరారు. తన సోదరుడు జగన్ కి, ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్లకి మాత్రమే ఓటు వేయాలని కోరారు. ఇలా అమె చేసిన సంచలన వ్యాఖ్యలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
వైఎస్ వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని, అలాంటప్పుడు ఈ కేసు గురించి సునీత ఆయన్ను ఎందుకు నిలదీయలేకపోయిందని సజ్జల ప్రశ్నించారు. వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి చంద్రబాబు, బీటెక్ రవి కారణం కాదా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జట్టు కట్టారని అడిగారు. సునీత ఈరోజు ముసుగు తీసిందని, ఆమె ఎవరి ప్రతినిధో ఇవేళ తేలిపోయిందన్నారు.
ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే విషయం అందరికీ అర్ధమవుతుందని అన్నారు. సునీత వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, ఆమె వ్యాఖ్యలకు తలా తోక లేదని అన్నారు. సునీత మాటల వెనుక కుట్ర ఉందని అన్నారు. చంద్రబాబు చేతిలో సునీత ఓ పావులా మారారని అన్నారు. వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు ఉన్నాయనీ, విచారణ అన్నింటిపైనా జరుగుతుందన్నారు.
సునీత ఏమన్నారంటే.. సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారు అనేది నాలుగైదు రోజుల్లో నిర్ధరణకు రావొచ్చనీ, కానీ వివేకా కేసులో అయిదేళ్లు అయినా ఇంకా ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన తర్వాత 2019 మార్చి 15న మార్చురీ బయట అవినాష్ తన వద్దకు వచ్చి రాత్రి 11.30 గంటల వరకూ పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారన్నారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారని, మనం మాత్రం రియలైజ్ కాలేమన్నారు. వివేకాను చంపిన వాళ్లను వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుందని ప్రశ్నించారు.
మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని, వాళ్లదరినీ జగన్ రక్షిస్తున్నాడన ఆరోపించారు. అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుందని అన్నారు. వంచన, మోసానికి పాల్పడ్డారన్నారు. మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దని, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలేనని అన్నారు. వివేకా హత్య కేసులో ఎనిమిది మంది పేర్లు బయటకు వచ్చాయని, ఇంకా రాని వారి పేర్లు చాలా ఉన్నాయని అన్నారు. వివేకా కేసులో శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాతనే కేసు మొత్తం మారిపోయి భయం మొదలైందని సునీత అన్నారు. అప్పటి నుండే సీబీఐ పై కేసులు పెట్టడం ప్రారంభించారన్నారు.
సిబ్బందిపై కేసుల తర్వాత కడప నుండి సీబీఐ అధికారులు వెళ్లిపోయారన్నారు. కేసు హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాతనే మళ్లీ విచారణ ప్రారంభమైందన్నారు. అవినాష్ రెడ్డి అరెస్టు కోసం సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లినప్పుడు అక్కడ ఏమి జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. తాను ప్రజల్లోకి వెళ్తానని, అయితే ఎలా వెళ్లాలనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందనీ, నేను పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సునీతా రెడ్డి తెలిపారు. షర్మిల ఒక్కరే నాకు మొదటి నుండి అండగా నిలిచారని అన్నారు.
Breaking: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు .. నలుగురికి గాయాలు.. పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు..