గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బీజేపీ అయితే వివిధ అంశాల ఆధారంగా విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన కామెంట్లు చేయగా … దానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అదే రీతిలో స్పందించారు.
యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే….
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ మల్కాజ్ గిరి, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజలో బహిరంగ సభలో మాట్లాడారు. నిజాం ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో కలపాలని చూడగా ఇక్కడి ప్రజలు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. వారికి మద్దతుగా సర్దార్ పటేల్ నిలిచి భారత దేశంలో విలీనం చేశారని తెలిపారు. అయితే, ఇప్పటికి కూడా కొంతమంది నిజాం వారసులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ అరాచకాలు చేస్తున్నారని ఆరోపించిన నిజాం వారికి ఈ జి.హెచ్ యం సి ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాలని అన్నారు.
అయోధ్య రామ మందిరం … హైదరాబాద్ భాగ్యనగరం…
హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చేందుకు నగర ప్రజలందరితో కలిసి నడిచేందుకు వచ్చానని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు కల్పించారు.. ఇక్కడి ప్రజలు చాలా మంది రామాలయం నిర్మాణానికి ముందుకు వచ్చారని, మోడీ రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఘనత దక్కించుకున్నారని అన్నారు. “హైదరాబాద్ ని భాగ్యనగర్ ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. యూపీ లో ఫైజాబాద్ ని అయోధ్య గా, అలహాబాద్ ని ప్రయాగ్ రాజ్ గా మార్చాం..ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ భాగ్యనగరంగా పేరు మారడమే కాకుండా అభివృద్ధి జరుగుతుంది` అని అన్నారు.
దోచుకుంటున్నారంటూ…
ఓ కుటుంబం ఎంఐఎంతో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తుందని ఆ దోపిడీకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చానని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నిజాం రూపంలో ఒక కుటుంబం హైదరాబాద్ ,తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారు, దానిని సాకరం కాకుండా చూడాలని అన్నారు. బీహార్ లో నితీష్ ప్రభుత్వం ఏర్పడ్డాక, శాసన సభలో ప్రమాణం చేసే సమయంలో యంఐయం ఎమ్మెల్యే హిందుస్తాన్ అని పలకను అని అన్నాడు ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ హిందూస్తాన్ అనను అంటున్నారు అని ఫైరయ్యారు. యంఐయం నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని యోగి పేర్కొన్నారు.
కేసీఆర్ విమర్శలు…
కాగా యూపీ సీఎంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైరయ్యారు. “యూపీ సీఎంకు అసలు టికాన లేదు… ఆయన నాకు నీళ్లు ఇస్తాడట. యూపీ 25 ర్యాంకులో ఉంది..25వ ర్యాంకొడు వచ్చి ఐదో ర్యాంక్ వచ్చిన మనకు చెప్తాడు ` అని ఎద్దేవా చేశారు. టెంటు లేదు..ఫ్రంట్ పెడతారు అంటున్నారని ఫ్రంట్ పెడుతున్న అని ఎవడు చెప్పాడు ? అని ఆయన ప్రశ్నించారు. నేను ఏట్లోస్తామో… చూపెడతా అని అన్నారు.