ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో సింహాచలం దేవస్థానం వివాదం ఒకటి. దేవస్థానంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రోజు రోజుకీ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. అక్రమార్కుల అక్రమాల చిట్టా కూడా పెరుగుతోంది. అయితే.. దీనికి రాజకీయం కూడా తోడైంది. మన్సాస్ ట్రస్ట్ తోపాటు సింహాచలం దేవస్థానం పాలకమండలి చైర్ పర్సన్ గా ఉన్న సంచయిత గజపతి వర్సెస్ టీడీపీగా మారింది. సంచయిత వచ్చాకే అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూండగా.. గత ప్రభుత్వ హయాంలో దేవాలయ ఆస్తులు, ఆదాయంపై ఆడిట్ నిర్వహించపోవడం వల్లే అవినీతి జరిగిందని టీడీపీ నాయకులు అందుకే వణుకుతున్నారని ఆమె అంటున్నారు.
అయిదేళ్ల నుంచీ అక్రమాలు జరిగాయా..
దేవస్థానంలో జరిగిన అక్రమాల్లో హైమావతి అనే మహిళ ప్రధాన సుత్రధారిగా అనుమానిస్తున్నారు. విచారణాధికారిగా ఉన్న దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ ఆజాద్ తన విచారణలో పలు అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. దేవస్థానంలో హైమావతి తమ్ముళ్లు, మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ స్కామ్ లో ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నారు. దేవస్థానంకు వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించడంలో వీరు కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రాబ్యాంక్ తరపున ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిగా ఎడ్ల శ్రీను బ్యాంకు ఖాతాలో ఆరు లక్షల రూపాయాలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఒక చిరుద్యోగి ఖాతాలో ఇంత లావాదేవీలు ఎలా జరిగాయి.. ఎవరెవరికి నగదు వెళ్లిందనేదానిపై విచారణ జరుగుతోంది.
ఔట్ సోర్సింగ్ చిరుద్యోగి మాములోడు కాదు..
గతంలో కూడా శ్రీనుపై ఆరోపణలు ఉన్నట్టు గుర్తించారు. విలాసవంతమైన జీవితం, ట్రావెల్స్ వ్యాపారం.. ఇవన్నీ దేవస్థానంకు చెందాల్సిన నగదుతోనే చేసాడని అంటున్నారు. విరాళంగా వచ్చిన మొత్తంలో 90శాతం ఇతను చాకచక్యంగా పక్కకు తీసేవాడని దేవస్థానానికి 10శాతం లెక్కలు చూపేవాడు. ఇలా దేవస్థానంను, బ్యాంకును కూడా మోసం చేశాడు. ఇందులో ఇంకెవరి పాత్ర ఉంది.. ఎంతమందికి డబ్బు ముట్టిందనేదానిపై లెక్కలు తీస్తున్నారు అధికారులు. కొన్నేళ్ల నుంచీ జరుగుతున్న ఈ అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి విచారణలో మరెంత అవినీతి వెలుగులోకి వస్తుందో చూడాలి.