న్యూఢిల్లీ: బిజెపి సంస్థాపక దినం నాడు ఎంపి శత్రుఘన్ సిన్హా ఆ పార్టీని వదిలిపెట్టారు. చాలాకాలంగా బిజెపి అగ్ర నాయకత్వం తీరుపై బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఆ మాజీ సినీ నటుడు శనివారం కాంగ్రెస్లో అధికారికంగా చేరారు. కొద్ది రోజుల క్రితం శత్రుఘన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినపుడే ఆయన దారెటో తెలిసిపోయింది.
బిజెపికి గుడ్బై చెబుతున్న సందర్భంలో శత్రుఘన్ ఆ పార్టీని నడిపిస్తున్న ఇద్దరు నాయకులపై చెణుకులు విసిరారు. ‘ఈ ఒన్ మ్యాన్ షో, టు మెన్ ఆర్మీ వ్యవహారంలో అంతా ప్రధాని కార్యాలయం నుంచే జరుగుతుంది. కేంద్ర మంత్రులు స్వేచ్ఛగా పని చేయలేరు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే:
‘అద్వానీని మార్గదర్శక్ మండలికి పంపారు. అది ఒక్క సారి కూడా సమావేశం కాలేదు. జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హాలకు కూడా అదే గతి పట్టించారు. నాకు కూడా నువ్వు పార్టీని విమర్శిస్తున్నావు, నీకు మంత్రి పదవి దొరకదు అని చెప్పారు’.
‘పెద్ద నోట్ల రద్దు ప్రపంచంలో అతి పెద్ద స్కామ్. ఆ కారణంగా చాలామంది మరణించారు. అది ఏమాత్రం బుర్ర లేని పని’.
శత్రఘన్ సిన్హా కాంగ్రెస్ తరపున బీహార్లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు.