నరసరావుపేట, ఏప్రిల్ 6: దేశంలోనే అత్యంత సమస్యాత్మక పార్లమెంటు నియోజక వర్గంగా ఎన్నికల కమిషన్ గుర్తించిన నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల బరిలో ఉద్దండులు నిలవడంతో హోరాహోరీ పోటీ నెలకొని ఉంది.
ఈ లోక్ సభ నుండి ప్రాతినిథ్యం వహించిన కాసు బ్రహ్మానంద రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోశయ్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి నుండి సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు, వైసిపి తరఫున విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీ కృష్ణ దేవరాయలు, బిజెపి నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నుండి నయూబ్ కమల్, కాంగ్రెస్ నుండి పి.సూరిబాబు రంగంలో ఉండగా ప్రధానమైన పోటీ టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య ఉందని భావిస్తున్నారు. అయితే జనసేన, బిజెపి అభ్యర్థుల చీలిక ఓట్ల ప్రభావం ఎవరిమీద పడుతుందో అన్న ఆందోళన ప్రధాన పార్టీ అభ్యర్ధుల్లో నెలకొని ఉంది.
ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ పార్లమెంటు నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గత నెలలో వైసిపిలో చేరారు. గుంటూరు నుండి నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాయపాటి సాంబశివరావు మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. బిజెపి నుండి పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ నాలుగు పర్యాయాలు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తొలిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. వైసిపి నుండి పోటీ చేస్తున్న కృష్ణదేవరాయలు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయటం ఇదే ప్రథమం.
2009పార్లమెంట్ ఎన్నికల్లో పిఆర్ పి అభ్యర్ధి రంగంలో నిలవడంతో నాడు టిడిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి కేవలం 1607ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మోదుగులకు 4,63,358ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి బాలసౌరికి 4,61,751ఓట్లు రాగా పిఆర్ పి అభ్యర్ధి షేక్ సయ్యద్ సాహెబ్ కు లక్షా14వేల ఓట్లు వచ్చాయి.
2014ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి రాయపాటి సాంబశివరావు వైసిపి ఆభ్యర్ధి అయోధ్య రామిరెడ్డిపై 35,289ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
నాడు పిఆర్ పి, నేడు జనసేన పార్టీలు ముస్లిం మైనార్టీ అభ్యర్ధిని బరిలో నిలపడం గమనార్హం.
అంగబలం, అర్థ బలం ఉన్న నాయకులు బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూద్దాం.