విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
హంగ్ పార్లమెంట్ వస్తే తప్ప జాతీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మానవని జగన్ అన్నారు. అప్పుడు ప్రాంతీయ పార్టీల విలువ హెచ్చుతుందనీ, మరింత గట్టిగా కేంద్రంతో వివిధ అంశాలపై తమ వైఖరి వినిపించగలవనీ ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్కు గానీ, బిజెపికి గానీ ఎలాంటి పాత్రా లేదని జగన్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో అనుసరించిన ద్వంద్వ విలువల వల్ల ఆ రెండు పార్టీలూ విశ్వసనీయత కోల్పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా ఇచ్చే ఏ పార్టీనయినా, కూటమినైనా బలపరుస్తానని ఆయన చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు జగన్ మళ్లీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా విషయంలో సంఘీభావం ప్రకటించారనీ, ఎన్నికల తర్వాత టిఆర్ఎస్, మజ్లిస్ ఎంపీలతో కలిపి 42 మంది ఎంపీలు ప్రత్యేకహోదా సాధించగలరనీ ఆయన అన్నారు.