విజయవాడ రమేష్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం, 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అనేకమందిని కలచి వేసింది. దీనిపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు ఈ సంఘటన, తదనంతర పరిణామాలు రాజకీయ రంగును పులుముకుంటున్నాయి.
అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఎపిసోడ్లో తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబు, ఆయన కుమారుడు ఏం చేశారో తెలుసా?
తాజాగా మీడియాతో మాట్లాడిన వల్లభనేని వంశీ రమేష్ హాస్పిటల్లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుందదని వల్లభనేని వంశీ నిలదీశారు. “విశాఖ ఎల్.జి పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లేఖలు రాయలేదా? 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యంపై కేసులు పెట్టడం తప్పు ఎలా అవుతుందో వారే చెప్పాలి?` అని వల్లభనేని వంశీ సూటిగా నిలదీశారు.
కమ్మ వాళ్లను భ్రష్టు పట్టించడమే బాబు పని
`కమ్మ సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు తయారయ్యాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబు కులం రంగు పూస్తున్నాడు. రమేష్ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ కింద నగదు చెల్లించినప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచితనం కనపడలేదా? ` అని వల్లభనేని వంశీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరును తప్పుపట్టారు. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని చంద్రబాబు గమనించాలి అని అన్నారు. తప్పు చేయని రమేష్ హాస్పిటల్ యాజమాని రమేష్ పారిపోవాల్సిన అవసరం ఏముందని వల్లభనేని వంశీ ప్రశ్నించారు.
కేసీఆర్ చేసిన పనిపై నోరెత్తవేం బాబు?
తెలంగాణలో కోవిడ్ హాస్పిటళ్లు తప్పు చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోలేదా ? అని వల్లభనేని వంశీ ప్రస్తావించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని ప్రకటించుకుంటారు. అలాంటప్పుడు తెలంగాణలో ఎందుకు మాట్లాడరు అంటూ వంశీ ప్రశ్నించారు.
బాబును భలే బుక్ చేసేశాడుగా!
ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును ఇరకాటంలో పడేసే కామెంట్లు చేశారు వల్లభనేని వంశి. కరోనా మహమ్మారి ఉధృతం, లాక్ డౌన్ విధించిన గత 5 నెలల్లో 4 రోజులు మాత్రమే చంద్రబాబు ఏపీలో ఉన్నారని వంశి వివరించారు. రాష్ట్రంలో పనిలేని బాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఆంధ్రా వదిలి రూంలో కూర్చున్న చంద్రబాబు జూమ్లో మాట్లాడుతున్నారని, మానసిక భ్రాంతితో తన ఫోన్ ట్యాప్ అయిందంటున్నారని ఎద్దేవా చేశారు.