ఆత్మ విశ్వాసానికి, అతి విశ్వాసానికి తేడా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది అంటారా? ఔను. కానీ అది మర్చిపోయిన అంశం తాజాగా తెరమీదకు వచ్చింది.
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాను అన్నట్లుగా అన్నట్లుగా తెలంగాణలో ఇప్పటికే అడ్రస్ గల్లంతు అయిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో సత్తా చాటుతుందట. ఎక్కడో తెలుసా? హైదరాబాద్లో.
హైదరాబాద్లో అగ్ని పరీక్ష
తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా నిర్వహించే మెట్రో నగరాల్లో టాప్లో ఉండే హైదరాబాద్లో ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టింది. వచ్చే నెల లేదా డిసెంబర్లో గ్రేటర్ సమరానికి ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. 150 డివిజన్లు ఉన్న GHMCలో ప్రస్తుతంలో TRSకు 99 కార్పొరేటర్లు ఉన్నారు. ఈసారి సెంచరీ కొట్టి మరింతగా దూసుకెళ్లాలని అధికార పార్టీ అన్ని వైపుల నుంచి మోహరిస్తోంది. మరోసారి సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ, బలం పెంచుకోవాలని MIM.. ఇలా వ్యూహ రచనలో పార్టీలు మునిగిపోయాయి.
ఒహ్…. టీడీపీ కూడా..
అన్ని ప్రధాన పార్టీలు క్రియాశీల ప్లానింగ్తో ముందుకు సాగుతున్న సమయంలో…. తాము రంగంలో ఉండాలని అనుకున్నట్లుగా ఉన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. అందుకే గ్రేటర్ ఎన్నికలకపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఈ ఎన్నికల్లో పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు వర్కింగ్ ప్రెసి డెంట్లను నియమిస్తున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ ఏం చేస్తుందో తెలుసా?
గ్రేటర్ ఎన్నికలను సవాల్గా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన ప్రణాళికను అమల్లో పెట్టింది. ఎన్నికల వ్యూహ రచనలో తలమునకలైపోయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా చేశారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని భావిస్తున్నప్పటికీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదు. టికెట్ల పంపిణీ మొదలు.. డివిజన్లలో సమస్యలు… ఇతర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. వీటిల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా.. వాటిని అధిగమించి పార్టీకి సానుకూల వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉంటుందని తెలిపారు. ఆ మధ్య టీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. క్షేత్రస్థాయి సర్వే తర్వాత చాలా మంది కార్పొరేటర్లపై జనాల్లో వ్యతిరేకత ఉన్నట్టు ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు మంత్రులు శ్రమిస్తున్నారు.
ఇప్పుడు బాబు వచ్చి…
ఇలా అధికార పార్టీ మైండ్ గేమ్ ఇప్పటికే మొదలై, విజయవంతంగా అమలు అవుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రకటన సహజంగానే ఆసక్తిని రేకెత్తించేది. అసలు నాయకులే లేని ఆ పార్టీ గ్రేటర్లో అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టగలదా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఒంటరిగానే తమ పోటీ అని ఆ పార్టీ ప్రకటించడం మేకపోతు గాంభీర్యానికి నిదర్శనమని చెప్తున్నారు.