ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృత్యువాత పడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు వెళ్ళిన రైతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎటవా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పండ్లను విక్రయించడానికి రైతులు ట్రక్కులో వెళుతుండగా ఎటవా ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో ఎదురెదుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు ఎటవా జిల్లా ఎస్ పి ఆర్ సింగ్ తెలిపారు.
మృతుల కుటుంబాలకు 2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.