Southern Zonal Council Meeting 2021: సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం నేటి సాయంత్రం తిరుపతిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపి ప్రభుత్వ ఆతిథ్యంలో జరుగుతున్న ఈ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. తిరుపతి తాజ్ హోటల్ లో జరిగే ఈ సమావేశానికి ఏపి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో పాటు అండమాన్, లక్షద్వీప్ లెప్టినెంట్ గవర్నర్ లు హజరు కావాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కీలక సమావేశానికి ఆరుగురు ముఖ్యమంత్రులు హజరు కావాల్సి ఉండగా ముగ్గురు సీఎంలు హజరు అవుతున్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్ ఎస్ జడ్ సీ ఉపాధ్యక్షుడి హోదాలో హజరవుతుండగా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుఛ్చేరి సీఎం ఎన్ రంగస్వామి పాల్గొంటున్నారు.
Southern Zonal Council Meeting 2021: ఈ ముగ్గురు సీఎంలు డుమ్మా
తెలంగాణ సీఎం కేసిఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లు ఈ సమావేశానికి హజరు కావడం లేదని సమాచారం. తెలంగాణ సీఎం తరపున ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హజరు అవుతున్నారు. అదే విధంగా తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రుల తరపున కూడా ఆ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. నేటి మద్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7.30వరకూ జరిగే ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌళిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్ధికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి 26 ప్రధాన అంశాల పై చర్చ జరగనుంది.
కీలక అంశాల ప్రస్తావనకు సిద్ధమైన ఏపి సీఎం వైఎస్ జగన్
ఒక్కో రాష్ట్రం ఒక్కో ఎజెండాతో ఈ సమావేశానికి వస్తున్నాయి. ఈ సమావేశంలో ఏపి సీఎం వైఎస్ జగన్ స్వాగతోపన్యాసం చేస్తారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. వీటితో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీల అమలు చేయాలని కోరనున్నారు. ఇదే క్రమంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాలపై కూడా గట్టిగా సమాధానం ఇచ్చే విధంగా ఏపి ప్రభుత్వం గణాంకాలతో సహా తమ వాదన వినిపించడానికి రెడీ అయ్యింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే సీఎం జగన్ సన్నాహక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర నిధుల విషయంలో కర్ణాటక మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తుందన్న విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి. మరో పక్క రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతోంది. దీంతో ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా సదరన్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని సీపీఐ ప్రకటించిన నేపథ్యంలో తిరుమతిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఐ నేత నారాయణను ముందస్తు గా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.