Medaram: తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతరలో ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. నేడు ఉపవాస దీక్షలతో భక్తులు మండమెలిగే పండుగను జరుపుకోనున్నారు.
మండమెగిలే పండుగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఆదివాసీ సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుండి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజమందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామంలో గోవిందరాజు, పడిగిద్ద రాజు ఆలయాల్లో ఈ ఉత్సవాల సందర్భంగా పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడిపోవడంతో ..పూజారులు అడవికి వెళ్లి మండలు (చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండుగ జరుపుకునే వారు. దీనినే మండమెలిగే పండుగ గా పేర్కొంటారు.
పూజారులు అందరూ ఆచారం ప్రకారం తలో పని చేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు. కాగా, ఇవేళ జరిగే పూజలకు గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకూ మేడారం మహాజాతర కొనసాగనుంది.
Medaram Jatara: మేడారం జాతరకు వెళుతున్నారా ..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే .. వన్ వే రూట్లు ఇవే..!