Teenmar Mallanna: తెలంగాణ బీజేపిలోకి చేరికలు జోరందుకుంటున్నాయి. నిన్న తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యోగుల సంఘ నేత సీహెచ్ విఠల్ బీజేపీ తీర్ధం పుచ్చుకోగా నేడు జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలో కేంద్ర బీజేపీ కార్యాలయంలో తెలంగాణ పార్టీ ఇన్ చార్జి తరుణ్ ఛుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు. మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదును అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తొలుత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందనరావు విజయం, తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే పది రెట్లు కార్పోరేషన్ స్థానాలు గెలుచుకోవడం, ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలుపుతో ఆ పార్టీ నేతలు.. ఆధికార టీఎస్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న విఠల్ ను, నేడు తీన్మార్ మల్లన్నను పార్టీలో చేర్చుకున్నారు.
Teenmar Mallanna: తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులతోనే శాస్తి
పార్టీలో చేరిన సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ తాను తీసుకున్నది బీజేపీ సభ్యత్వ రసీదు కాదు, 15 మీటర్ల తాడు అని వ్యాఖ్యానించారు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసిఆర్, కేటిఆర్, కవిత, హరీష్ రావు ను కట్టేసి అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తానన్నారు. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసిఆర్ అని విమర్శించారు. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నించే నాటికి తాను ఒక్కడినే కానీ ఇప్పుడు చాలా గొంతుకలు కలిశాయన్నారు. తాను తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీకి వచ్చానని అన్నారు. తనపై కేసిఆర్ ప్రభుత్వం 38 కేసులు పెట్టి ఏమి సాధించిందని ప్రశ్నించారు. తనపై కేసులు నమోదు చేసినందుకు పోలీసులు బాధపడ్డారనీ, న్యాయవాదులు మధనపడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యమకారులు అంతా ఒక్కటవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి కేసిఆర్ పై పోరాటం సాగిస్తామన్నారు మల్లన్న.