Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి పంచాయతీ ముగిసింది. సీఎం ఎవరో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీపీసీసీ రేవంత్ రెడ్డికే సీఎం బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించారు. డిప్యూటి సీఎం గా మల్లు భట్టివిక్రమార్క,ఆర్ధిక శాఖ మంత్రి గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లను కూడా అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండే రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకుందని రాహుల్ గాంధీ తో సహా అనేక మంది నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 40 మందికిపైగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పేరును సూచించడంతో అధిష్టానం మెజార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తొంది.
వాస్తవానికి 2021లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.2014 ఎన్నికల్లో, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ కు జైకొట్టి వెళ్లిపోయారు. ఆ పరిస్థితిలో తెలంగాణలో అధికార బీఎస్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నట్లుగా పరిస్థితి అయిపోయింది. ఆ పరిస్థితుల్లో సీఎం కేసిఆర్ పై దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ భావించారు. అప్పుడు కూడా రేవంత్ నాయకత్వాన్ని పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకించారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ పట్టుబట్టి రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగించి ఎవరి వత్తిళ్లకు తలొగ్దకుండా గోహెడ్ అని సంకేతాలు ఇచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి అధికార పార్టీ పై మరింత దూకుడు పెంచారు. అధికార పార్టీ, కేసిఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు యువత, మహిళలను ఆకట్టుకున్నాయి. అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లడమే కానీ వేరే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు లేవు, కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమైయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన వారిని రేవంత్ ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత గెలుపునకు రేవంత్ రెడ్డి శ్రమ, వ్యూహంతో పాటు ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కారణమని అధిష్టానం నమ్మినట్టుగా తెలుస్తొంది.
అయితే రేవంత్ రెడ్డి పై అవినీతి కేసులు ఉన్నాయనీ, ముఖ్యంగా ఓటు కు నోటు కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని పలువురు సీనియర్ లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డికి సీఎం చేస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దుల విజయంపై ప్రభావం పడుతుందన్న విషయాన్ని కూడా నేతలు కొందరు గుర్తు చేశారని సమాచారం. అయినప్పటికీ రాహుల్ గాంధీ రేవంత్ పేరుకే ఓకే చెప్పినట్లు తెలుస్తొంది. ఖర్గే నివాసంలో కీలక సమావేశం అనంతరం రాహుల్ వెళ్లిపోయారు. సీనియర్ లకు నచ్చచెప్పే పనిని కేసి వేణుగోపాల్, డీకే శివకుమార్ లకు అప్పగించి రాహుల్ వెళ్లిపోయారు. అనంతరం కేసి వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో డీకే శివకుమార్, మాణిక్యరావు ఠాక్రే, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరో పక్క తెలంగాణ సీఎం అభ్యర్ధిగా ఎవరి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా తనకు ఆమోదమేనని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్ణాటక డిప్యూటి సీఎం, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్ తో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హూజూర్ నగర్ ఎమ్మెల్యేగానూ గెలిచిన నేపథ్యంలో ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానని తెలిపారు. అది ఎప్పుడు అనేది త్వరలో నిర్ణయించి వెల్లడిస్తానని తెలిపారు.