Revanth Reddy: తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సీఎం పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డీకే శివకుమార్, మాణికరావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలో రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు కేసి వేణుగోపాల్.
నిన్న నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో సీఎల్పీ భేటీ నిర్వహించామని చెప్పారు కేసీ వేణుగోపాల్. సీఎల్పీ సమావేశంలో పార్టీని గెలిచిపించినందునకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారన్నారు. డీకే శివకుమార్, మాణిక్యరావు ఠాక్రే శాససనభ పక్షం అభిప్రాయాలతో కూడిన నివేదికను అందించారని చెప్పారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేశామన్నారు. రేవంత్ రెడ్డి డైనమిక్ గా వ్యవహరించారని, అందరినీ కలుపుకుని పోయి పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. కాగా, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమై వెళ్లారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుండి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, సీఎల్పీ భేటీలో భిన్నాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో సీఎల్పీ నేత ఎంపిక వ్యవహారం పార్టీ అధిష్టానాకి చేరింది. నిన్న ఉదయం నుండి నెలకొన్న ప్రతిష్టంభనకు కేసి వేణుగోపాల్ ప్రకటనతో తెరపడింది. మంత్రివర్గ కూర్పు తదితర విషయాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ కబురు చేసినట్లుగా భావిస్తున్నారు.
Telangana Congress: దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షే(నా)..! మాజీ మంత్రి కడియం సంచలన కామెంట్స్