టీడీపీ అధినేత చంద్రబాబు.. బలమైన టార్గెట్ పెట్టుకున్నారా? తనపైనా, తన కుటుంబంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొందరు వైసీపీనేతలను ఏరిపారేయడమే లక్ష్యంగాఆయన అడుగులు వేయాలని నిర్నయించుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు తమ్ముళ్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీని మట్టి కరిపించడంతో కాదు…ఆ పార్టీలో కీలక నేతల ఓటమికి ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఇంతకాలం తెలుగుదేశం పార్టీని అనేక ఇబ్బందులకు గురి చేసిన వారు… మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న ధ్యేయంతో కనిపిస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక టీంలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొంత మందిని టార్గెట్ చేసుకుని మరీ ఎన్నికలకు సిద్దమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఇబ్బందుల్లోకి నెట్టిన వైసీపీ బిగ్ షాట్స్ను టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. వైసీపీలో కొందరు నేతలు అదే పనిగా టీడీపీని విమర్శించారు. మాటలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమే కాదు.. విపరీతమైన డామేజ్ చేశారు. అందుకే అధికార పార్టీలోని కొందరి బిగ్ షాట్స్ను టార్గెట్ చేసుకుని ఎన్నికలకు వెళ్లేలా టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
ఈ ఎలిమినేషన్ జాబితాలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ వంటి వారు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిపై టీడీపీ సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. వీరంతా టీడీపీ, చంద్రబాబును విపరీతంగా డామేజ్ చేసేందుకు ప్రయత్నించారని తరచుగా బాబు చెబుతున్నారు. టీడీపీని, చంద్రబాబును నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి.. కుప్పంలో టీడీపీని టార్గెట్ చేసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టారు.
కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పదే పదే కామెంట్లు చేస్తూ…టీడీపీ కేడర్ను ఇరిటేట్ చేస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు సెగ్మెంటుపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పెద్దిరెడ్డి ఎన్నికల సమయంలో పుంగనూరు దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించాలని నిర్ణయించింది. దీంతో పుంగనూరులో ప్రత్యేక టీంలను రంగంలోకి దించాలని భావిస్తోంది.
మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు టీడీపీ, చంద్రబాబు ను టార్గెట్ చేసుకున్న వారే. చంద్రబాబు, టీడీపీపైన వీరంతా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో వీరి టార్గెట్గా కూడా పార్టీ శ్రేణులు పని చేయాల్సిన అవసరం ఉందనే ఆలోచన చేస్తోంది. వీరి కోసం క్షేత్ర స్థాయిలో నెట్ వర్కింగ్ చేసుకుని టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియా విభాగాల ద్వారా.. ఇతరత్ర మార్గాల ద్వారా సదురు బిగ్ షాట్స్ను టార్గెట్ చేసుకునే ప్రక్రియకు టీడీపీ శ్రీకారం చుట్టినట్టు సమాచారం.
మిగిలిన నియోజకవర్గాలంతా ఓ ఎత్తు…తమ హిట్ లిస్టులో ఉన్న వీళ్ల సెగ్మెంట్లల్లో ఎన్నిక మరో ఎత్తు అనే రేంజ్లో టీడీపీలో చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లాకు చెంది మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఓడించేలా పక్కా ప్లాన్లో ఉన్నట్టు తెలిసింది. గుడివాడలో పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము, గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు వీలైనంత వరకు అన్ని రకాల సాయం అందించేందుకు ఇప్పటికే ప్లాన్ సిద్దం చేసినట్టు తెలుస్తోంది.