టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి దగ్గర అయిన విషయం తెలిసిందే. టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్ లు వైసీపీ పంచన చేరారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా టీడీపీకి దూరమైయ్యారు. వైసీపీకి దగ్గర అధికార వైసీపీకి దగ్గర అయ్యారు. అదే కోవలో మరో ఎమ్మెల్యే నేడు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో అనధికారికంగా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.
కరణం దారిలోనే..
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కు పార్టీ కండువా కప్పించి, ఆయన వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయారు. అదే విధంగా నేడు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ శనివారం ఆయన కుమారు సూర్యను అధికారికంగా వైసీపీలో చేర్పిస్తున్నారు. ఆయన మాత్రం వైసీపీ అనుబంధ సభ్యుడుగా కొనసాగనున్నారు.
గంటా కంటే ముందుగానే..
2009 ఎన్నికల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుండి టిడిపి నుండి తొలి సారిగా పోటీ చేసిన వాసుపల్లి గణేష్ పరాజయం పాలైయ్యారు. ఆ తరువాత వరుసగా 2014,2019 ఏన్నికల్లో విజయం సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖను పరిపాలనా రాజధాని ప్రకటించిన తరువాత గత కొద్ది రోజులుగా వాసుపల్లి గణేష్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే విశాఖ నుండి ముందుగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా ఆ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కారణంగా ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తోంది. గంటా కంటే ముందుగానే వాసుపల్లి గణేష్ వైసీపీ పంచన చేరుతున్నారు. ఒకరి తరువాత ఒకరుగా ఇప్పటి వరకూ నలుగురు ఎమ్మెల్యేలు దూరం అవ్వడంతో టీడీపీకి అసెంబ్లీలో బలం 19కి పడిపోతోంది.