Vote: వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఒక సారి ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో పరిశీలించుకోండి.. లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్క కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే నమోదు చేసుకునేందుకు ఇదే అఖరి అవకాశం. దీన్ని చేజార్చుకుంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధాన్ని కోల్పోయినట్లే.
సాధారణంగా నామినేష్ల గడువు చివరి రోజు వరకూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వాటి పరిశీలన, నోటీసుల జారీ, దరఖాస్తుదారుల సమాధానం కోసం వారం రోజులు గడువు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకే ఈసీ అవకాశం కల్పించింది. వీటిని పరిశీలించి అర్హులైన వారందరికీ ఓటరు జాబితాలో చోటు ఇవ్వనుంది. తుది జాబితాకు అనుబంధంగా ఈ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. అందులో పేర్లు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఓటర్ల నమోదును ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. https://ceoandhra.in.in వెబ్ సైట్ లేదా, https://voterportal.eci.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటు హక్కు కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. లేదా స్మార్ట్ ఫోన్ లో ప్లేస్టోర్ నుండి voterhelpline యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయి న్యూఓటర్ రిజిస్ట్రేషన్ అనే విభాగానికి వెళ్లి వివరాలు అన్ని నింపి దరఖాస్తు సబ్మిట్ చేయవచ్చు. ఆఫ్ లైన్ లో బూత్ స్థాయి అధికారులకు (బీఎల్వో) నేరుగా ఫాం – 6 దరఖాస్తు సమర్పించవచ్చు.