మునుగోడు ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు అభ్యర్ధిత్వం ఖరారు చేయడంతో ప్రభాకరరెడ్డి శుక్రవారం ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసిఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంలో సీఎం కేసిఆర్ .. ఆయనకు బీఫారమ్ తో పాటు ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరపున రూ.40 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ నిధి నుండే ఈ మొత్తాన్ని మునుగోడు అభ్యర్ధి ప్రభాకరరెడ్డికి కేసిఆర్ అందించినట్లు టీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయడం తో పాటు ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధి నుండి రూ.40లక్షలు ఇవ్వడంపై అభ్యర్ధి ప్రభాకరరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు సీఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుండి ఎన్నికల ఫలితం వచ్చే వరకూ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధి రూ.40లక్షలకు మంచి ఖర్చు చేయడానికి వీలులేదు. సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్ధులు అనదికారికంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే ఇసీ నియమావళి ప్రకారం ఖర్చులను తక్కువగా చూపుతుంటారు. కాగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈసీ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 3వ తేదీ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని వెల్లడించనున్నారు.
నోటిఫికేషన్ విడుదల కాకముందు నుండే మునుగోడులో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారంతో వాతావరణం హీట్ ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజా శాంతి పార్టీ తరపున ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. బీఎస్పీ కూడా తమ పార్టీ అభ్యర్ధిని ప్రకటిస్తామని తెలిపింది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు .. మరో సారి సోదాలు చేపట్టిన ఈడీ