TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు విచారణకు నో చెప్పారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీ (రేపు)న సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదని చెప్పారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు మరో లేఖ రాశారు. సీబీఐ అధికారుల విచారణకు సహకరిస్తానని తెలియజేసిన కవిత..ఈ నెల 11,12,14,15లలో సీబీఐ అధికారులకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలను అడిగితే వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నట్లు సీబీఐ అధికారులు తెలిపారనీ, నిందితుల జాబితా, ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలను వెబ్ సైట్ లో పరిశీలించగా, ఫిర్యాదులో గానీ ఎఫ్ఐఆర్ లో గానీ నిందితుల జాబితాలో తన పేరు లేదని చెప్పారు కవిత. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కవిత పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరించడానికి గానూ తాను చెప్పిన తేదీల్లో ఎప్పుడైనా సీబీఐ అధికారులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని కవిత తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఐడీ అరెస్టు చేసిన తర్వాత, ఆయన రిమాండ్ రిపోర్టు రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించడం, ఆ మరుసటి రోజే సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. నోటీసులు అందుకున్న వెంటనే కవిత న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఆ మరుసటి రోజే తన తండ్రి, ముఖ్యమంత్రి కేసిఆర్ తో కవిత భేటీ అయ్యారు. అయితే తాజాగా కవిత రాసిన లేఖపై సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.