ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మద్దతుపై టీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటి వరకూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై ఇచ్చే అంశంపై మౌనం వహించిన టీఆర్ఎస్ .. నేడు తన నిర్ణయాన్ని వెల్లడించింది. విపక్ష పార్టీల ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు అందరూ మార్గరేట్ అల్వాకు ఓటు వేయాలని అధిష్టానం నిర్ణయించింది. మార్గరేట్ అల్వాకు 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఓటేయనున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విడుదల చేశారు.
పార్లమెంట్ భవనంలో రహస్య బ్యాలెట్ విధానంలో రేపు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఆర్ ఓ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ ఖడ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏ అభ్యర్ధి జగదీప్ ధన్ ఖడ్ కు మద్దతు ఇవ్వాలని ఏపికి చెందిన అధికార వైసీపీ, టీడీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్.. ఉప రాష్ట్రపతి విపక్షాల అభ్యర్ధి కాంగ్రెస్ కు చెందిన నాయకురాలు కావడంతో కొంత అనుమానాలు తలెత్తాయి. మమత బెనర్జీ తరహాలోనే ఎన్నికలకు దూరంగా టీఆర్ఎస్ దూరంగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే చివరకు కాంగ్రెస్ అభ్యర్ధి అయినా సరే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
మహా’ పంచాయతీలో సుప్రీం కీలక ఆదేశాలు .. ఉద్దవ్ కు ఊరట