హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టిసి కార్మికులు నవంబర్ అయిదవ తేదీలోగా బేషరుతుగా విధుల్లో చేరాలనీ, అలా చేరితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో సమస్యను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దృష్టికి తీసుకువెళ్లాలని ఆర్టిసి జెఎసి నాయకులు నిర్ణయించారు. ఆదివారం రాష్ట్ర బిజెపి నేతలతో పాటు టిజెఎస్, సిపిఐ, టిడిపి నేతలను జెఎసి నేతలు కలిశారు. తాము చేస్తున్న సమ్మెను జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టిసి పరిస్థితిని అమిత్షాకు వివరించి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరతామని జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా ఆర్టిసి కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుపు నిచ్చిన నేపథ్యంలో విధుల్లో చేరే కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని రాచకొండ సిపి మహేష్ భగవత్, సైబరాబాద్ సిపి సజ్జనార్లు తెలిపారు. సిబ్బంది నిర్భయంగా విధుల్లో చేరవచ్చని వారు చెప్పారు.
కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో కార్మికుల్లో అలజడి రేగే ప్రమాదం ఉందని భావించిన కార్మిక జెఏసి నేతలు ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించారు. ప్రభుత్వ హెచ్చరికలకు భయపడేది లేదనీ, సమ్మె కొనసాగుతుందనీ ప్రకటించారు. అయితే సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాచలం డిపోలలో కార్మికులు విధుల్లో చేరుతామని లేఖలు ఇచ్చారు. సిరిసిల్ల డిపో మెకానిక్ శ్రీనివాస్, సిద్దిపేట డిపో కండక్టర్ విశ్వేశ్వరరావు విధుల్లో చేరారు.ఉప్పల్ డిపోకు చెందిన అసిస్టెంట్ డిపో మేనేజర్ కేశవ కృష్ణ తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డిపో మేనేజర్ను ఆదివారం కలిసి తన సమ్మతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను బేషరతుగా సమ్మె నుండి బయటకు వచ్చి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు.