ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీలో మేము ముందున్నామంటే.. మేము ముందున్నామని ఆయా దేశాలు ప్రకటించుకుంటున్నాయి. భారత్లో రెండు కంపెనీలు ఫేజ్ 1, 2 ట్రయల్స్కు సిద్ధమని ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు రష్యా కూడా ఫేజ్ 1 ట్రయల్స్లో ఉన్నట్లు తెలిపింది. ఇక తాజాగా అమెరికా కూడా కరోనా వ్యాక్సిన్ రేసులో నిలిచింది. తాము కూడా ఆ వ్యాక్సిన్కు ఫేజ్ 1 ట్రయల్స్ను విజయవంతంగా చేపట్టామని వెల్లడించింది.
అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ భాగస్వామ్యంతో మోడెర్నా అనే ఫార్మా కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ను తయారు చేసింది. దీనికి గాను అక్కడ ప్రస్తుతం ఫేజ్ 1 ట్రయల్స్ పూర్తయ్యాయి. జూలై చివరి వరకు ఫేజ్ 3 ట్రయల్స్ చేపట్టనున్నారు. అయితే ఫేజ్ 1 ట్రయల్స్లో ఆసక్తికర ఫలితాలు వచ్చినట్లు సైంటిస్టులు వెల్లడించారు. చాలా స్వల్పమైన సైడ్ ఎఫెక్ట్లతో కోవిడ్ వ్యాక్సిన్ పనిచేసిందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కోవిడ్ వైరస్ పట్ల ఇమ్యూనిటీని ప్రదర్శించారని, అలాగే వారికి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలా కొద్ది మందిలో వణకడం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, ఇంజెక్షన్ తీసుకున్న చోట నొప్పి తదితర లక్షణాలు కనిపించాయని సైంటిస్టులు తెలిపారు. ఈ క్రమంలో ఫేజ్ 2, 3 ట్రయల్స్ను కూడా విజయవంతంగా పూర్తి చేస్తామన్న నమ్మకం తమకుందని అన్నారు. అయితే ఫేజ్ 1లో కేవలం కొద్ది మంది వాలంటీర్లపైనే వ్యాక్సిన్ను ప్రయోగిస్తారు. ఫేజ్ 2, 3లలో క్రమంగా వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో వ్యాక్సిన్ భిన్న రకాల వ్యక్తులపై ఎలా పనిచేస్తుంది, ఎంత మోతాదులో డోసు ఇవ్వవచ్చు, ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.. అని స్పష్టత వస్తుంది. ఆ తరువాత వ్యాక్సిన్ ను నిర్దిష్టమైన డోసుల్లో తయారు చేసి ప్రజా పంపిణీకి సిద్ధం చేస్తారు.
ఇక తమ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తయి పంపిణీకి అనుమతి పొందితే.. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్కు గాను 500 మిలియన్ల డోసులను తయారు చేస్తామని మోడెర్నా కంపెనీ తెలిపింది. 2021 వరకు వ్యాక్సిన్కు 1 బిలియన్ డోసులను సిద్ధం చేస్తామని తెలియజేసింది.