విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచారం ఆసక్తిగా మారింది. అధికార వైసీపీ తరఫు న వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వెల్లంపల్లి ఒకరకంగా స్పీడ్ పెంచారు. ఈయన కు కుమార్తె కూడా కలిసి వస్తున్నారు. ఇంటింటికీ వెల్లంపల్లి కుమార్తె సాయి అశ్విత తిరుగుతున్నారు. మహిళలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక, వలంటీర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తాయిలాలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే సెంట్రల్కు వెల్లంపల్లి కొత్తే అయినా.. మచ్చిక చేసుకోవడం లో మాత్రం ముందుకు సాగుతున్నారు. ఇక, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు పరిస్తితి ఇప్పటి వరకు ఎటూ తేలలేదు. ఆయన ఇక్కడ ఇప్పటికీ ప్రచారం ప్రారంభించలేదు. అంతేకాదు.. కనీసం ఒక జెండా కట్టింది కూడాలేదు. పోనీ.. తన వారితో అయినా.. కార్యక్రమాలు చేపట్టాలి కదా!
అది కూడా కనిపించడం లేదు. బొండా ఉమాకు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాను మాత్రమే ఎదగాలనే వ్యూహంతో ఆయన ఎవరినీ ఎదగకుండా చేస్తున్నారని అంటున్నారు తమ్ము ళ్లు. ఈ వివాదాలు గత స్తానిక ఎన్నికల నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే బొండా బార్య స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగి కూడా.. ఓడిపోయారు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారంలోనూ తమ్ముళ్లు ఇదే భావనతో ఉన్నట్టు సమాచారం.
అందుకే.. బొండా ఉమా అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆర్థికంగా కూడా సొమ్ములు సమకూర్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ మరోకీలక విషయం.. జనసేన నాయకులు ఏమేరకు బొండాతో కలిసి వస్తున్నారు అనేది. ఎందుకంటే.. ఇప్పటి వరకు బొండా ఉమా జనసేన నాయకులను కలుపుకొని పోయింది లేదు. వారితో మాట్లాడింది కూడా లేదు. అహం బ్రహ్మ.. అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు.