ప్రమాదాలు అనేవి మనకు చెప్పి రావు. అనుకోకుండానే వస్తాయి. నిత్యం అనేక మంది రక రకాల ప్రమాదాలకు గురై చనిపోతుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఆ మహిళ మాత్రం సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయింది. అలా జరుగుతుందని నిజానికి ఆమె కూడా ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
బెంగళూరులోని సదాశివనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బెల్ (బీఈఎల్) రోడ్ నెయిబర్హుడ్ ప్రాంతంలో నందినీ రావు (45) తన భర్త రాజేష్ రావుతో కలిసి నివాసం ఉంటోంది. వీరికి పిల్లలు కలగకపోవడంతో ఒకరిని దత్తత తీసుకున్నారు. అయితే రాజేష్ రావు నిత్యం తమ కారుకు సంబంధించి పని చూసుకునేవాడు. నిత్యం బయటకు వచ్చి కారు ఇగ్నిషన్ కొంత సేపు ఆన్ చేసి ఉంచి తరువాత ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్లేవాడు. కాగా బుధవారం రాజేష్ రావుకు బదులుగా నందినీ రావు ఆ పని కోసం బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె కారు ఇగ్నిషన్ ఆన్ చేయగా అది రివర్స్ గేర్లో ఉండడం, హ్యాండ్ బ్రేక్ తీసి ఉండడంతో ఒక్కసారిగా ఆ కారు వెనక్కి వచ్చింది. అక్కడే నిలుచుని ఉన్న నందినీ రావు కారు డోర్కు, పక్కనే ఉన్న చెట్టుకు మధ్య ఇరుక్కుపోయింది. ఆ క్రమంలో డోర్ ఆమె తలకు బలంగా తాకింది. దీంతో ఆమె తల చెట్టుకు ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
అయితే ఒక్కసారిగా పెద్దగా వచ్చిన శబ్దానికి ఇరుగు పొరుగు వారందరూ బయటకు వచ్చారు. ఆమె అలా చనిపోవడం చూసి షాకయ్యారు. నిజంగా ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతుంటాయని వారు పేర్కొన్నారు. అయితే నిజానికి ఆ చెట్టు నందినీ రావు ఇంటికి ఎదురుగా ఉండడంతో దాని వల్ల ఇంట్లో చీకటిగా ఉంటుందని ఆమె ఆ చెట్టును తొలగించాలని కాలనీలో అందరితోనూ గతంలో అంటూ ఉండేది. కానీ ఆ చెట్టుకే ఆమె ఢీకొని చనిపోవడం షాకింగ్గా ఉందని కాలనీవాసులు తెలిపారు. పోలీసులు సెల్ఫ్ యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.