PRC: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పీఆర్సీ ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కారణంగా జరిగే డ్యామేజీని నివారించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగంలోకి వచ్చేసింది.
పీఆర్సీ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు విజయవంతం కావడంతో అటు జగన్ ప్రభుత్వం ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తం అయ్యింది. వెంటనే ఉద్యోగుల ఆరోపణలకు ప్రభుత్వపరంగా కౌంటర్ ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాదముందని,తద్వారా పార్టీకి నష్టం వాటిల్లవచ్చునని అంచనా వేసిన వైసీపీ హైకమాండ్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జులు,ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలకు ఒక సర్క్యులర్ పంపింది.ఇందులో పిఆర్సికి సంబంధించిన గణాంకాలన్నీ పొందుపర్చింది.పార్టీ నేతలంతా దీనిని ప్రతిచోటా వల్లె వేయాలని ఆదేశించింది.
ఆ సర్క్యులర్లో ఏముందంటే?
జగన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇరవై మూడు శాతం ఫిట్ మెంట్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి నష్టం వాటిల్ల లేదన్న విషయాన్ని అందులో ప్రముఖంగా పొందుపరిచారు.ఏ ఒక్కరికీ ఒక్కపైసా కూడా జీతం తగ్గలేదంటూ కంపారిటివ్ స్టేట్మెంట్స్ కూడా అందులో చేర్చారు.స్కేల్స్ పెంచినా పెంచకపోయినా జీతం గ్రాస్ పెరిగిందా లేదా అన్నదే ముఖ్యమని దాన్నే ప్రభుత్వోద్యోగులు చూసుకోవాలని వైసీపీ కేంద్ర కార్యాలయం తన సర్క్యులర్లో పేర్కొంది.హెచ్ఆర్ఏను కూడా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రామాణికంగా ఇస్తుందో దాన్నె తామూ ఆంధ్రప్రదేశ్ లో అనుసరించామని వెల్లడించింది.
PRC: వాళ్లందరికీ జీతాలు పెంచలేదా?
పనిలో పనిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇదే సర్క్యులర్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది,శానిటరీ వర్కర్లు,సంఘమిత్రలు యానిమేటర్లు తదితర సిబ్బంది జీతాలు పెంచిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. హోంగార్డులకు డెయిలీ అలవెన్సులు పెంచడాన్ని వివరించింది.అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని విధాలుగా జగన్ ప్రభుత్వం మేలు చేస్తుందన్న వాదన అంతిమంగా వినిపించింది.అంతేగాక ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని రాష్ర్టాలకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువ అని వెల్లడించింది.ఇవే ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు వివరించి ప్రభుత్వంపైనా పార్టీపైనా అపోహలను తొలగించాలని ఆ సర్కులర్ లో పార్టీ శ్రేణులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది.