అవును.. పార్టీలో చేరికల కోసం తపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక్కొక్కరుగా చేరువ అవుతున్నారు. వ చ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చినా.. రాకున్నా.. కనీసం `కింగ్ మేకర్`గా అయినా ఉండాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే 20-30 స్థానాలపై కాంగ్రెస్ నేతలు కన్నేశారు. ఈ సీట్లు సాధించడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో ఏర్పడబోయే ప్రభుత్వానికి తాము దన్నుగా ఉండాలని నిర్ణయించారు. దీనిని సక్సెస్ చేసుకునే క్రమంలోనే పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు.
ఇక, ఇప్పటి వరకు చూసుకుంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ.. వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టినా.. ఇప్పటి వరకు పార్టీలో ఎవరూ చేరలేదు. దీనికితోడు వైసీపీ నుంచి బయటకు వస్తున్న వారు కూడా.. కాంగ్రెస్ వైపు చూడడం లేదు. దీంతో పార్టీలో చేరే వారిని ప్రోత్సహించడం.. పెంచుకోవడం వంటివి నాయకులకు ఇబ్బందిగా మారింది. ఇదిలావుంటే.. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు చేరేందుకు రెడీ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించింది. గ్రాఫ్ బాగోలేదని పేర్కొంటూ.. ఎం.ఎస్. బాబు ను పక్కన పెట్టారు. దీంతో ఆయన సీఎం జగన్ సహా పార్టీలో పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీలు మీకు అణిగి మణిగి ఉండాలా? అంటూ.. ప్రశ్నించారు. తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. పూతలపట్టులో అభివృద్ధి జరగకపోవడానికి తాను కారణం కాదన్నారు. మొత్తంగా ఎంఎస్ బాబు.. పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారు.
ప్రస్తుతం బాబు చూపు కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన తాజాగా కర్ణాటక మంత్రి శివకుమార్ ఓఎస్డీ(ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ)ని కలిసి, తన మనసులో మాట చెప్పారు. తన బలాన్ని.. బలగా న్ని కూడా చూపించారు. పార్టీ మారేందుకు రెడీగా ఉన్నానని బాబు చెబుతున్నారు. దీంతో ఆయన రాక దాదాపు ఖాయమేనని అంటున్నారు. కానీ, ఆర్థికంగా కొంత వెనుబడి ఉండడం, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే ఖచ్చితంగా సొమ్ములు కావాల్సి ఉండడంతో ఏం జరుగుతుందనేది చూడాలి.
ఇక షర్మిల కూడా ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి వదిలించుకుంటోన్న వీక్ లీడర్లు వచ్చినా కూడా కూడా ఆమె బ్రహ్మాండంగా సాదర స్వాగతం పలకనున్నారు.