ఏపీలో రాయలసీమ ప్రాంతం పేరు చెబితే అందరికీ గుర్తు వచ్చే పదం కరువు. అదే రీతిలో తాగునీటి సమస్య కూడా. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో నీటి దాహం తీర్చడానికి వైయస్ జగన్ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందుకుగాను రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
సీమ ప్రాంతంలో దాహం తీర్చడానికి ఏపీ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఓ ఎస్పీవీని వైయస్ జగన్ సర్కార్ ఏర్పాటు చేయనున్నారు. 100% ప్రభుత్వ నిధులతో ఈ వాహక సంస్థ పని చేయనుంది. ఈ సందర్భంగా కార్పోరేషన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఎస్పీవీని రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు మొట్టమొదటిగా తొలి జలవనరుల శాఖ నుంచి 5 కోట్ల పెట్టుబడి మంజూరు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచడానికి నిర్దేశించిన 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రాయలసీమ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల సమీకరణకు ఎస్పీవీని ఉపయోగించనున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో 40 వేల కోట్ల మేర రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు ఖర్చు చేయాలని జలవనరుల శాఖ ఇంజనీర్ తో ప్రభుత్వం ఆలోచన చేసినట్లు దానికి సంబంధించి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం.