గత వారం రోజులుగా ఎంతో ఉత్కంఠగా మారిన ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారం కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…. హైకోర్టుకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇక నేడు ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నిమ్మగడ్డ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అందరూ అనుకున్నట్లే రాజ్యాంగ పదవులతో ప్రభుత్వాలు ఆటలాడుకోవద్దు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్డినెన్స్ తీసుకురావడంలో ప్రభుత్వానికి మంచి ఉద్దేశాలు మరియు ఆలోచనలు ఉన్నాయి అని తాము సంతృప్తి చెందలేదని పేర్కొంది.
అలాగే ఇదే సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు రెండు వారాలలో వారి సమాధానం కావాలని ఆదేశించింది. మొదటి నుండి జగన్ మరియు అతని ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కనబర్చిన వైఖరి అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ కు భారీ షాక్ కాగా నిమ్మగడ్డ రమేష్ కు ఊరట లభించినట్లే అయింది. మరి ఇప్పుడైనా ప్రభుత్వం తక్షణమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తుందా లేక మరేదైనా కౌంటర్ తో వస్తుందా అన్నది వేచి చూడాలి.