మరుగున పడిపోయిన అంశంగా భావిస్తూ వచ్చిన ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ప్రస్తావించటం
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది! ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వెనుకడుగు వేశాడు అని అందరూ భావిస్తూ వచ్చారు. ఒక దశలో జగన్ బీజేపీ కి కనుక కేంద్రంలో మెజారిటీ కంటే తక్కువ సీట్లు వచ్చి ఉంటే ప్రత్యేక హోదా గురించి తాము పట్టు బట్టడానికి వీలు ఉండేదని ఇప్పుడు వారికి ఎవరితో అవసరం లేకుండాపోయినందున తానేమీ చేయలేకపోయానన్న ధోరణిలో మాట్లాడారు.ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయం ఎక్కడా పెద్ద ప్రస్తావనకు రాలేదు.అయితే అనూహ్యంగా సీఎం జగన్ తన స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు .
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటామని ప్రకటించారు. అయితే అదే సమయంలో ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం లేదని కూడా చెప్పారు. కానీ భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారి, కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆశిస్తున్నామని, కేంద్రానికి ఈ అంశాన్ని గుర్తు చేస్తూనే ఉంటామని జగన్ చెప్పుకొచ్చారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా సాధించేది తామేనని కూడా ఆయన తెలిపారు. తనంతట తానే ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా గురించి తన ప్రసంగంలో ప్రస్తావించటం ఇతర రాజకీయ పక్షాలకు షాక్ అనే చెప్పవచ్చు.
ఎదుటి వారు ఎవరు నోరెత్తకుండా జగన్ ముందే వారి మూతికి సీలు వేశారు!అదే విధంగా తన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ అది ఎందుకు అవసరమో బాగా వివరించారు!రాష్ట్ర విభజన గాయం మళ్లీ మళ్లీ కాకుండా ఉండాలంటే.. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాల్సి ఉందని,వికేంద్రీకరణే సరైన విధానం అని తేల్చి చెప్పారు.తమ పాలనలో రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతున్నామని జగన్ ప్రకటించారు.
తాము చేపట్టే పథకాలన్నీ ప్రజల్ని పేదరిక నుంచి బయటపడేసేందుకేననన్నారు. అందరికీ ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పేందుకు ప్రయత్నిస్తూంటే.. కొందరు అడ్డుకుంటున్నారని జగన్ వేదికపై నుంచి ఆరోపించారు.మొత్తంగా చూస్తే జగన్ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ప్రజలను ఆకట్టుకునే రీతిలోనే ఉంది!