రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎలా జరుగుతుందో చెప్పడం అత్యంత కష్టమైన విషయం! నిన్నమొన్నటివరకూ కాంగ్రెస్ కు బద్దశత్రువుల్లో వైకాపా అధినేత జగన్ ఒకరని కథనాలు వచ్చాయి! అదికూడా ఎవరూ కాదనలేదనే సత్యమే అనేది సోనియమ్మను అడిగితే తెలుస్తోంది! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షపాత్రలో ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు జగన్ ఆధారం అవుతున్నారు.. పరోక్షంగా వారు జగన్ ని నమ్ముకునే రాజకీయం చేస్తున్నారన్నా ఆశ్చర్యం లేదు.. అతిశయోక్తి కాదు!!
ఉదాహరణకు కర్ణాటకలో ముఖ్యమంత్రి యాడ్యురప్పను విమర్శించడానికి ఈ మధ్యకాలంలో వారు ఎంచుకున్న మార్గం… జగన్ ని ఉదాహరణగా చూపించడం. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు ఏమనుకుంటారన్న ఆలోచన కూడా చేయకుండా జగన్ పై ప్రశంశల వర్షాలు కురిపించారు సిద్దరామయ్య! జగన్ ను పొగుడుతున్నట్లు పొగుడుతూనే… జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వంపై ఫైరయ్యారు! ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదలైన నేతలు.. కేసీఆర్ ని తిట్టడానికి ముందు జగన్ ను పొగుడుతున్నారు.
తాజాగా ఈ విషయంలో మరోసారి జగన్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ కు సూచనలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్! కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాల్సిందేనని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఏపీలో జగన్ సర్కార్ కరోనా వైద్య ప్రక్రియలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చిందని… ఆపాటి ఆలోచన కేసీఆర్ చేయకపోయినా.. కనీసం జగన్ చేసిన తర్వాత అయినా చేస్తే బాగుండేదని… ప్రజలు అయినా, ప్రతిపక్షాలు అయినా చేసే డిమాడ్ ఇది అని పొన్నం అంటున్నారు!
జగన్ చేసినట్లు చేయొచ్చు కదా.. జగన్ ను ఆదర్శంగా తీసుకోవచ్చు కదా.. జగన్ ని చూశైనా నేర్చుకోవచ్చు కదా అన్న రేంజ్ లో కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. అక్కడ సిద్ధరామయ్యకు అయినా, ఇక్కడ టి.కాంగ్రెస్ నేతలకు అయినా… అది పూర్తిగా వారికి జగన్ పై ఉన్న ప్రేమ అనుకుంటే పొరపాటవ్వొచ్చేమో కానీ… ముఖ్యమంత్రులపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడానికి మాత్రం జగన్ పాలన వారికి బలమవుతుంది! ఇది ఏపీ జగన్ ఫ్యాన్స్ కి సంతోషమవ్వొచ్చేమో కానీ.. తెరాసలో ఉన్న జగన్ ఫ్యాన్స్ కి మాత్రం కాస్త ఇబ్బందనే అనుకోవాలి!!