YS Sharmila: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు పోటీలో ఉంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో షర్మిల మీడియాతో మాట్లాడుతూ..తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని అన్నారు. తన లక్ష్యం తనకు ఉందని అన్నారు.
ప్రజా శ్రేయస్సు కోసమే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లుగా చెప్పారు షర్మిల. తెలంగాణ తనకు మెట్టినిల్లు అయితే ఏపీ తనకు పుట్టినిల్లు, ఈ రాష్ట్రంలో పుట్టాను, అక్కడ పెరిగాను అని పేర్కొన్నారు. తాను స్వేచ్చగా పని చేస్తానని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. రోజుకు మూడు జిల్లాల్లో పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. ఈ నెల 24వ తేదీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ విజయవాడ వస్తారని, ఆ రోజు నుండి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఆశావహ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని తెలిపారు.
తన తండ్రి రాజశేఖరరెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావడం అని, ఆ కోరిక నెరవేర్చడం కోసం పని చేస్తున్నానని తెలిపారు. తెలంగాణలో ఓ నియంతను గద్దె దింపామని అన్నారు. తన పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటపడిందని అన్నారు.
YS Sharmila: ఏపీలో వైసీపీ, టీడీపీ దొందూ దొందేనన్న వైఎస్ షర్మిల .. జగన్ పై ఘాటుగా..