Sajjala Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ షర్మిలకు పలు సూటి ప్రశ్నలు వేశారు.
షర్మిల వాడిన భాష, యాస పై సజ్జల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిబద్దతతో పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్దిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
సీఎం వైఎస్ జగన్ పై పెట్టినవి అక్రమ కేసుని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాదే చెప్పారన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు సజ్జల. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏమి తెలుసునని ప్రశ్నించారు. తెలంగాణ నుండి ఏపీకి హఠాత్తుగా షర్మిల ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందనీ, గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయనీ, ఇప్పుడు ఆ పార్టీ తరపున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదన్నారు. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేసారని ప్రశ్నించారు. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునని అన్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేనని పేర్కొన్నారు. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజాన ఎత్తుకుందని అన్నారు. చంద్రబాబు కుట్రలో షర్మిలను చివరి అస్త్రంగా ప్రయోగించారని అన్నారు సజ్జల.
గతంలో చంద్రబాబుతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని సజ్జల అన్నారు. ప్రత్యేక హోదా ను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చలో పెట్టలేదని ప్రశ్నించారు. దీనిపై షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. సీఎం జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి మేలు చేస్తున్నారనీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడరని చెప్పారు. వైఎస్ఆర్ తనయగా, వైఎస్ జగన్ సోదరిగా షర్మిలను తాము అభిమానిస్తామన్న పేర్కొన్న షర్మిల..టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తొందని అన్నారు.