YSRCP: ఏపీలో సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మండల స్థాయి నాయకులు జట్టు కడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేయడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఇవేళ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా నేతలు సమావేశమైయ్యారు. నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం సిద్ధాంతంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైసీపీ నేతలు విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు .. ఎమ్మెల్యే రంగనాథరాజుకు వ్యతిరేకంగా గళం విప్పారు.
నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కనీస గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గ నాయకుడితో కూడా ఆయన గౌరవం గా మాట్లాడటం లేదని మండిపడ్డారు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కు రంగనాథరాజు చెడ్డపేరు తీసుకువస్తున్నారని అన్నారు. కేవలం జగన్ వల్లనే తాము రంగనాథరాజుకు ఓట్లు వేసి గెలిపించామన్నారు.
నియోజకవర్గంలో చాలా మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని వారు మండిపడ్డారు. ఒక వేళ రంగనాథరాజుకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాము పార్టీ అధిష్టానానికి తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో పరిస్థితులపై ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టి సారించినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పడంతో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్ధి ఓట్ల చీలికతో నాటి కాంగ్రెస్ అభ్యర్ధి పితాని సత్యనారాయణ విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ఎన్నికల్లో టీడీపీ తరపున పితాని సత్యనారాయణ వైసీపీ అభ్యర్ధిపై కేవలం 3,920 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథరాజు టీడీపీ అభ్యర్ధి పితానిపై 12,886 ఓట్ల తేడాతో గెలుపొందారు. జనసేన పార్టీ అభ్యర్ధికి 13,993 ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అభ్యర్ధి బరిలో దిగుతున్న ఈ తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు జట్టుకట్టడం ఇబ్బందికరంగా మారింది. పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Nara Lokesh: ప్రతి ఏటా డీఎస్సీ .. నిరుద్యోగులకు నారా లోకేష్ హామీ