YSRCP: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్న సంవత్సరాలు దాటింది. ఇప్పుడిప్పుడే వైసీపీలో కుమ్ములాటలు ఆరంభం అయ్యాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనబడుతోంది. ఓ పక్క ప్రజల్లో వ్యతిరేకత, మరో పక్క కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకవర్గాలు తయారు అవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే జరిపిస్తున్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో అభ్యర్ధులను మార్చాక తప్పదనే సంకేతాలు కూడా పార్టీ అధిష్టానం నుండి చూచాయగా సూచనలు అందుతున్నట్లు సమాచారం.
YSRCP: ప్రాధాన్యత ఇవ్వడం లేదని..?
రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సుమారు 30 నుండి 40 నియోజకవర్గాల్లో సిట్టింగ్లపై ఆ పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలకు దగ్గర అయిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనీ, తొలి నుండి పార్టీలో ఉన్న వారిని విస్మరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో పక్క సొంత పార్టీకి చెందిన ఎంపీలతో సఖ్యతగా ఉన్న నేతలను పలువురు ఎమ్మెల్యేలు పక్కన పెట్టి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న మాట కూడా వినబడుతోంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఆమెకు సొంత పార్టీ నుండే అసమ్మతి కనబడుతోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గాలుగా వైసీపీ శ్రేణులు విడిపోయి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ కన్ఫర్మ్ చేస్తే సురేష్, మాణిక్యవరప్రసాద్ వర్గం సహకరించదనేది బహిరంగ రహస్యం.
30 నియోజకవర్గాల్లో నేతలకు
అదే విధంగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పరిస్థితి ఇటీవల బహిర్గతం అయ్యింది. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ ఇటీవల ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా దాదాపు 30 నియోజకవర్గాల్లో పార్టీ అంతర్గత విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో సర్వే ఆధారంగా వాళ్లకు టికెట్ ఇవ్వకుండా తప్పించడం గానీ, లేక వారిలో కొందరిని వేరే నియోజకవర్గానికి పంపడం గానీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి వీరంతా తమపై ఉన్న అసమ్మతిని పొగొట్టుకుంటారో లేక సీటు ఖాళీ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటారో చూడాలి మరి.