BREAKING: తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల తాజాగా చేసిన కామెంట్స్ ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన సోదరుడు వైఎస్ జగన్ తో ఆస్తి వ్యవహారాల విషయంలో షర్మిలకు భేదాభిప్రాయాలు వచ్చాయంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్రంలో వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకు షర్మిల ఏపిలో పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారంటూ ఓ పత్రికలో ఇటీవల కథనం వచ్చింది. అయితే ఆ వార్తలకు బలం చేకూరేలా నేడు షర్మిల వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
BREAKING: రాజకీయ పార్టీ పెట్టకూడదని రూల్ ఏమి లేదు
ఏపిలో రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై సోమవారం వైఎస్ షర్మిలను మీడియా ప్రశ్నించగా, రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టొచ్చు.. పెట్టకూడదని రూల్ ఏమి లేదు కదా అంటూ సమాధానం ఇచ్చారు. ఈ నెల 19 లేదా 20 నుండి షర్మిల తెలంగాణలో రైతు ఆవేదన పాదయాత్రను కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తుండగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపై సోమవారం మీడియాతో షర్మిల మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటిస్తామంటున్నా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని కేసిఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు, టీఆర్ఎస్ కార్యక్రమాలకు మాత్రం కరోనా నిబంధనలు అడ్డురావని అన్నారు. నిబంధనల వంకతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం తెలంగాణ సర్కార్ చేస్తోందని షర్మిల విమర్శించారు.
ఇద్దరి మధ్య విభేదాలు..?
ఇదే సమయంలో ఏపిలో రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై జరుగుతున్న ప్రచారంపై షర్మిలను మీడియా ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. గతంలోనూ షర్మిల.. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టనున్నారంటూ ఏబీఎన్ లో ముందుగా వెల్లడిస్తే ఏపిలోని వైసీపీ నేతలు ఖండించారు. అటువంటి ఆలోచనే లేదని విజయసాయిరెడ్డి లాంటి నేతలు పేర్కొన్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆమె రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా ఏపిలో రాజకీయ పార్టీ పెడతారా అన్న మీడియా ప్రశ్నకు ఆమె ఖండించలేదు. ఇటీవల పులివెందులలో వైఎస్ ఘాట్ వద్ద అన్న చెల్లి (జగన్, షర్మిల) వేరువేరుగా నివాళులర్పించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది.
Read More: YS Jagan: గేరు మార్చిన జగన్..! స్పాట్ లో ఇంట్రెస్టింగ్ నిర్ణయం..!?