YSRCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో, జిల్లాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆయనను పార్టీలోకి అహ్వానించారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం వైసీపీ ఇన్ చార్జి దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ చార్జి తోట నరసింహం లు ముద్రగడతో సమావేశం అయ్యారు.
భేటీ ముగిసిన అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ గొప్ప ఉద్యమం చేశారని అన్నారు. ఆఫర్ల కోసం పార్టీ చేరే వ్యక్తి కాదనీ, స్వతహాగా ఆయనే పార్టీలో చేరతారన్నారు. సీఎం వైఎస్ జగన్ కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసుననీ, ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారనీ మిథున్ రెడ్డి అన్నారు.
కాగా, ఇప్పటికే ముద్రగడతో మిథున్ రెడ్డి ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడారు. ఆయన పార్టీలో చేరికకు సముఖంగా ఉండటంతో ఇవేళ నేరుగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. మరో పక్క కాపుసేన నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా కలవడం దాదాపు ఖాయమైంది. ఎన్డీఏలో టీడీపీ చేరిక పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన బలంపై జగన్ గురి పెట్టారు. ఓ పక్క చేగొండి హరి రామజోగయ్య కుమారుడు, మరో పక్క ముద్రగడను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ పై వైసీపీ వ్యూహం అమలు చేస్తొంది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పవన్ వైపు కాపు వర్గం మొగ్గు చూపుతున్న వేళ ముద్రగడతో ఆ ఓటు బ్యాంక్ కు గండి కొట్టవచ్చని వైసీపీ లెక్కలు వేస్తొంది. ఈ క్రమంలో ముద్రగడ కుమారుడికి రాష్ట్ర స్థాయిలో కీలక నామినేటెడ్ పదవి కట్టబెడతారని తెలుస్తొంది. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారం చేయించాలని వైసీపీ భావిస్తొందని సమాచారం.
BRS MLA: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ .. కళాశాల భవనాలు కూల్చివేత