BRS MLA: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలు కూల్చివేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన దామరచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్ల కూల్చివేత ప్రారంభించారు.
మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్) ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలను చేపట్టారు.
అయితే కళాశాల సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. కూల్చివేతలను తీసుకువచ్చిన జేసీబీ ముందు భైటాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారికి అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.