పాత కాలం రోజుల్లో ఒ పండితుడు గ్రామస్తులకు సత్సంగం నిర్వహిస్తూ ఉల్లిపాయ తినడం ఆరోగ్యానికి హానికరని, ఉల్లి తినడం వల్ల శరీరం నుండి దుర్వాసన రావడంతో పాటు మనిషిలో ఉద్రేకం తెప్పించే స్వభావం ఉందని అందుకు ఉల్లి వాడవద్దు అని చెప్పారట. అనంతరం ఆ పండితుడు ఇంటికి వెళ్లి భోజనం చేస్తుండగా సాంబారులో ఒక్క ఉల్లిగడ్డ ముక్క కూడా తగలలేదుట. దీనితో ఆ పండితుడు సాంబారులో ఉల్లిపాయలు ఎందుకు వేయలేదని భార్య ను ప్రశ్నించగా.. తమరే కదా ఉల్లిపాయ తినుబండారాల్లో వాడొద్దని చెప్పారు కదా అందుకే వేయలేదు అని ఆమె చెప్పిందట. ఓసి పిచ్చిదానా నేను చెప్పింది జనాలకు గానీ నీకు కాదు అన్నాడుట. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సివచ్చింది అంటే.. ఆ పండితుడి మాదిరిగానే మన రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాపితంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. సామాన్యులు మొదలుకొని, ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా వ్యాధి గ్రస్తుల కోసం పాలకులు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా రోగుల ట్రీట్మెంట్ కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చేశాం, ఇన్ని చేశాం అని చెప్పుకుంటున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు మాత్రం వారికి కరోనా సోకడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేక కార్పొరేట్ వైద్యం కోసం పరుగులు పెడుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులకు కరోనా సోకగా యశోద, అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.
పాత కాలం నాడు పండితుడు ఉల్లి పాయ గురించి చెప్పినట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పేదవాళ్ళకే కానీ మా లాంటి నాయకులకు కాదన్నట్లు ఉంది వారి తీరు. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అంబులెన్సు పిలిపించుకొని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయిపోయారు. తనకు తన ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించేలా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వ్యవహరించడం ముదావహం. అక్కడి సీఎం తీరు చూసి అయినా మన నాయకులు షేమ్ ఫీల్ అవుతారో లేదో..?