రాష్ట్రాలలో పార్టీ ల బలాబలాలతో సంబంధం లేకుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచించి అమలు చేయడం భారతీయ జనతా పార్టీ (బీజేపీ )కి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇటువంటి వ్యూహాలు ఉత్తరాది రాష్ట్రాలలో క్లిక్ అవుతాయి కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా పారవు. ఈ విషయాన్ని గమనించే బీజేపీ..2024 ఎన్నికల నాటికి ఏపిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సరికొత్త వ్యూహంతో పావులు కదిపేందుకు సన్నాహాలు ప్రారంభించింది అని అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ బెంగాల్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినా, త్రిపురలో అధికారాన్ని బీజేపీ హస్తగతం చేసుకున్నా ఆయా రాష్ట్రాల్లో సీపీఎం బలహీన పడటం వల్లనే సాధ్యం అయ్యింది.
ప్రస్తుతం ఏపి విషయాన్నే తీసుకుంటే 151 స్థానాలతో సిఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా డీలా పడిపోయింది. టీడీపీకి గ్రామ స్థాయి నుండి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో నాయకులు బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని మరింత బలహీన పరిస్తే బీజేపీ రెండవ స్థానానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇటీవల వరకు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ పరోక్షంగా టీడీపీకి కాపు కాస్తున్నారనే విమర్శలు మోశారు. వైసీపీలోకి వెళ్లలేక, టీడీపీలో కొనసాగలేక సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలను సైతం బీజేపీలోకి తీసుకుని రావడంలో కన్నా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో మొదటి నుండి టీడీపీని వ్యతిరేకించే సోము వీర్రాజు అయితే ఈ వర్గానికి చెక్ పెడతారని రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయగలుగుతారని భావించి పార్టీ పగ్గాలు అప్పగించారని అనుకుంటున్నారు. గతంలో టీడీపీ నుండి బీజేపీకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరిగింది. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి తరువాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తదితరులు బీజేపీలో చేరిన తరుణంలో ఇంకా చాలా మంది వచ్చే వారు ఉన్నారని, మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, గంట శ్రీనివాసరావు తదితరులు కూడా బీజేపీవైపుకు చూస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఒక్క సారిగా పరిస్థితి స్తబ్దుగా మారడంతో టీడీపీ నుండి అధికార వైసీపీకి వలసలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని బలహీన పర్చకుంటే బీజేపీ బలపడే పరిస్థితి లేదు. కన్నా కొనసాగితే అది సాధ్యం కాదని పార్టీ అధిష్టానం దృష్టి కి వెళ్ళిపోయింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టై అప్ తో రాష్ట్రంలో బీజేపీ ప్రధాన భూమిక పోషించేందుకు అడుగులు వేస్తున్నది. సోము వీర్రాజు అధికార వైసీపీపై కాస్త సాఫ్ట్ కార్నర్ గా ఉన్నప్పటికీ పార్టీ ఆదేశాల మేరకే పని చేస్తారని నమ్మకం ఉంది అంటున్నారు. ముందుగా టీడీపీ క్యాడర్ ను లాగి బీజేపీని బలోపేతం చేస్తే ఎన్నికల నాటికి వైసీపీలోని అసంతృప్తివాదులు వచ్చి చేరతారని తద్వారా వైసీపీ, బీజేపీ- జనసేనకూటమి మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుందని వారి అభిప్రాయంగా ఉన్నట్లు సమాచారం.