అమరావతి, జనవరి 9: గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుంది అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. టిడిపి నాయకులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సభ్యత్వం నమోదు ముమ్మరం చేయాలి. ఇప్పటికి 64 లక్షల సభ్యత్వం పూర్తి అయ్యింది. నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. విశాఖ గ్రామీణం, కడప, శ్రీకాకుళంలో ముమ్మరం చేయాలి అని చంద్రబాబు సూచించారు.
దేశంలో సంఘ్ పరివార్ కుట్రల కేంద్రంగా మారింది. ఆర్ఎస్ఎస్ కుట్రలను అమలు చేసే కేంద్రంగా బిజెపి మారిందని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు మంచి కోసం అయితే స్వాగతిస్తాం, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లకు గండి కొడతామంటే ఎదిరించాలని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు సామాజిక వెనుకబాటుతనం రిజర్వేషన్లే ఉన్నాయి, ఆర్థిక వెనుకబాటుతనం రిజర్వేషన్లు కొత్తగా తీసుకువచ్చారు. కుట్ర కోణాలపై అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా పేదలకు రిజర్వేషన్లను స్వాగతించాలి. కాపుల రిజర్వేషన్ కోసం డిమాండ్ చేయాలి. వాల్మీకి బోయలను ఎస్టిల్లో చేర్చడం కోసం డిమాండ్ చేయాలి.