నెల్లూరు: ఆదాల ప్రభాకర్ రెడ్డి ఐదేళ్లు పనులు చేయించుకొని తీరా సీటు ఇచ్చాక పార్టీ ఫిరాయించారని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరు, ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
టిడిపికి కార్యకర్తలే అసలైన బలమనీ, వచ్చిపోయే నేతలతో పార్టీకి ఒరిగేదేమీ లేదని చంద్రబాబు అన్నారు. స్వార్థం కోసం పార్టీ మారే నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అన్ని పార్టీలను ఏకం చేసే శక్తి టిడిపికే ఉందని చంద్రబాబు అన్నారు. 25 మంది ఎంపీలుంటే ప్రధానిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 150 కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవటం ఖాయమని చంద్రబాబు అన్నారు.
కేసిఆర్, మోది, జగన్పై చంద్రబాబు ప్రధానంగా విమర్శలు చేశారు.
కేసిఆర్:
తెలంగాణలో టీడీపీ నేతలందరినీ కేసిఆర్ తన పార్టీలో కలుపుకున్నారనీ, అలాగే కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారని చంద్రబాబు అన్నారు. కేసిఆర్ ఏపీకి రాలేరు కాబట్టి, కేసులు ఉన్నాయి కాబట్టి కాల్మొక్కుతా అనే జగన్ను ఎంపిక చేసుకున్నారనీ చంద్రబాబు ఆరోపించారు. తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ వారి ఆటలు సాగనివ్వననీ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్:
వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించారనీ చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా హత్య ఇంటి దొంగలపనేనని ప్రజలు అనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. హత్య తర్వాత ఆధారాలు లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
బాబాయ్ హత్య జరిగితే జగన్ దాచిపెట్టాలని చూశారని చంద్రబాబు విమర్శించారు. ఆనాడు టిడిపి నేత పరిటాల రవిని పార్టీ ఆఫీసులోనే దారుణంగా హత్య చేశారన్నారు. వైఎస్ హయాంలో వందలాది మంది టిడిపి కార్యకర్తలను చంపారని, కుట్రలు, కుతంత్రాలు చేయడం వైసిపికి అలవాటేనని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో వైసిపిని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు అన్నారు.
మోది:
మంచివాళ్లకి కాపలా కాయకుండా దొంగలకు సహకరిస్తున్న మోది ఇప్పుడు జగన్ను కూడా కాపాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో వైకాపా నేతలు తిరుగుతూ లాబియింగ్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.